

భారతీయ మార్కెట్లో UPI అప్లికేషన్స్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిన్నమొన్నటి వరకు మార్కెట్ లీడర్ గా ఉన్న Google Payని వెనక్కి నెట్టి PhonePe ఇటీవల త్రైమాసికంలో మొదటి స్థానం లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఎదురు కాబోతోంది.
తమ smartphoneలో Whatsapp లేని వినియోగదారుడు ఉండడు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో 2018లో పది లక్షల మంది వినియోగదారులకు ట్రయల్ బేసిస్ మీద అందుబాటులోకి వచ్చిన Whatsapp Paymentsకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం నుండి అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన పేమెంట్ డేటా ఇండియాలోనే భద్రపరచాలి అనే నియమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టిగా పెట్టింది. దీనికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడం విషయంలో ఇప్పటివరకు Whatsapp Payments ఆలస్యమైంది.
అయితే ఎట్టకేలకు UPI చెల్లింపులకు సంబంధించి అధికారిక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) Whatsappకి పూర్తి స్థాయిలో అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా నిన్న చేసింది. ఈ నేపథ్యంలో దశలవారీగా Whatsapp Payments మనకు అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం చాలామంది యూజర్లకి Whatapp Payments అందుబాటులోకి రావడంతో వాట్సాప్ ద్వారా ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే అంత సులభంగా మనం ఎవరికైనా డబ్బులు కూడా పంపించు కునే అవకాశం లభించింది. వాట్సాప్ పేమెంట్ సదుపాయాన్ని వాట్సప్ అప్లికేషన్ లో పూర్తిస్థాయిలో ఇంటిగ్రేట్ చేయటం చాలా సులభమైన విషయం. ఇప్పటికే ఆ ఇంటిగ్రేషన్ పూర్తయి పూర్తి స్థాయిలో ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.
ఈ నేపధ్యంలో GooglePe, PhonePeలకు ప్రత్యామ్నాయంగా Whatsapp Paymentsని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ కీలకమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. NPCI నిబంధనల ప్రకారం భారతదేశం లో పనిచేస్తున్న ఏ UPI అప్లికేషన్ కూడా 33 శాతం వాటాకి మించి కలిగి ఉండకూడదు. ఈ నేపథ్యంలో Whatsapp Payments ఎంత పాపులర్ అయిన ప్పటికీ, అది మొత్తం మార్కెట్ షేర్ సొంతం చేసుకునే అవకాశాలు మాత్రం లేవు.